Wednesday 15 August 2012

మార్పు కోసం!

భాగ్యనగరం నుండి దాదాపు నలబై కిలోమీటర్లు దాటిన తరువాత ప్రదాన రహదారి నుండి ఇంకో ఐదు కిలోమీటర్లు లోపలికి వెళితే వస్తుందా వూరు. పల్లె వెలుగు బస్సు లోంచి దిగాడు రమణ. అతను ఒక పత్రికా విలేఖరి. ఉపాది హామీ పథకం పనులు జరుగుతున్నాయని తెలిసి అవి అమలు అయ్యే తీరును పరిశీలించి రిపోర్టు తయారు చేయడానికి వచ్చాడు. జర్నలిజం మీద వున్న మక్కువతో అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మూడేళ్ల కిందట తన కెరీర్ ప్రారంభించాడు. చాలా నిబద్ధతతో పనిచేస్తాడు. సమాజంలో మార్పు తీసుకురాగలిగేది, సమాజపు రూపు రేఖల్ని మార్చ గలిగేది మీడియానేన్నది అతని గట్టి నమ్మకం. 

బస్సు దిగి పది నిమిషాలలో పనులు జరుగుతున్న చోటికి చేరుకున్నాడు రమణ. అది చెరువులో పూడిక తీసే పనులు. దూరంగా నిలుచుండి గమనిస్తున్నాడు రమణ.  మద్య మధ్యలో తన కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు. అక్కడ పనులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి.  ఈరోజు కూలీలకు తాము చేసిన పనిదినాలకు వేతనం ఇచ్చే రోజు.  కూలీలలో ఎక్కువగా స్త్రీలే వున్నారు. మగ కూలీల్లో కొందరు తెగ హడావుడి పడుతుండడం చూశాడు. ఈలోపు పనులు పూర్తిగా ముగిశాయి. 

వేతనం కోసం అందరూ వరస క్రమంలో నిలబడ్డారు. ఇందాక తను చూసిన మగ కూలీలు తోసుకుంటూ వచ్చి అందరి ముందూ నిలబడ్డారు. ఎందుకు వీళ్ళకీ తొందర! ఇవేమైన సినిమా టికెట్లా అయిపోవడానికి! అనుకున్నాడు రమణ. ఇంతలో అధికారులు వచ్చి డబ్బు పంపిణీ చేయడం మొదలెట్టారు. 

ఇందాక హడావుడి చేసినవాళ్ళు వేతనం తీసుకుని పోతూవుంటే, “పైసల్ చేతిలో పడ్డాయి. గింక గా మందు దుకాణామ్కెల్లి షురూ చేస్తారు బద్మాష్ గాళ్ళు” అంటూ వెనక నిలబడ్డ స్త్రీలు తిట్టడం రమణకి వినబడింది. 

ఏంటి వీళ్ళు వారం రోజులు కష్టపడి సంపాదించిన కూలి డబ్బులతో ఇంటికి కావలిసినవి కొనుక్కోకుండానే మద్యం షాపుకు వెళతారా! మరి వీళ్ళు తెచ్చే కూలి కోసం ఇంట్లో ఎదురు చూసే వీళ్ళ పెళ్ళాం బిడ్డలు సంగతేంటి! వీళ్ళకి గుర్తుకురారా! ఆశ్చర్యం అనిపించింది రమణకి. సరే! ముందు వచ్చిన పని అవ్వనీ తరువాత చూద్దాం అనుకున్నాడు. 

అరగంటలో అందరికీ పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు అధికారులు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనను పరిచయం చేసికొని, ఇంటర్వూ చేస్తూ ఆ పథకం అమలు అవుతున్న తీరు తెన్నులు, వారి కొచ్చే ఇబ్బందులు, సాధకబాధకాలు తెలుసుకున్నాడు. ఇక ముగిస్తూ, ఇందాక ఆడ కూలీలు మాట్లాడుకుంటున్నవి, తనకు వచ్చిన సందేహాలను అధికారుల ముందు వ్యక్తపరిచాడు రమణ.  

“చూడండి! వున్న వూరిలో పనులు లేక పట్టణాలకు వెళ్ళే గ్రామీణ కూలీల వలసలను తగ్గించడానికి, ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించాలన్న సదుద్దేశంతో భారత ప్రభుత్వం ఈ పథకం ప్రవేశ పెట్టింది. దాన్ని సక్రమంగా అమలు చేయడానికి మా సాయశక్తులా కృషి చేస్తున్నాము. దానిలో భాగంగానే వేతన పంపిణీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము. కూలీ డబ్బులు ముట్టాక వాటిని ఎలా ఖర్చు పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం. దాని మీద మా అజమాయిషీ వుండదు అంటూ సమాధానం ఇచ్చాడు అధికారి.

అధికారి చెప్పింది కొంతవరకు సబబుగానే అనిపించింది రమణకి. అధికారులకు ధన్యవాదాలు తెలిపి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు.  అలా నడుచుకుంటూ వెళుతుండగా మద్యం అమ్మే బెల్టుషాప్, దాని ముందు కూర్చొని తాగుతున్న ఇందాకటి కూలీలు కనపడ్డారు అతనికి. అప్పటికే మత్తు ఎక్కినట్టుంది. కాస్త తూలుతున్నారు. ఆ దృశ్యాన్ని కెమేరాలో బంధించాడు. 

వాళ్ళ దగ్గరికి వెళ్ళి, “ఇప్పుడే కదయ్యా కూలీ డబ్బులు తీసుకున్నారు. అప్పుడే మొదలెట్టారు. ఇంటికి కావలిసినవి కొని తీసుకెళ్తే మీ ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా!”

“ఏయ్! నువ్వెవడివి మమ్మల్లడగడానికి. నీ పని చూసుకో పో!” అన్నాడొకడు. 

దూరం నుంచి గమనిస్తున్న ఓ వ్యక్తీ రమణ దగ్గరకు వచ్చి, “సార్! వదిలేయండి. వీళ్ళను మార్చడానికి రెండేళ్లగా ప్రయత్నిస్తున్నాను. కానీ వీళ్ళు మారరు” అన్నాడు

ఆ వ్యక్తిని చూస్తూ, “ఇంతకూ మీరెవరు?” ప్రశ్నించాడు రమణ.

“నేనొక సామాజిక కార్యకర్తను. నా పేరు సూర్య!” అంటూ పరిచయం చేసుకున్నాడు.

చేయ్యందిస్తూ, “ముఖంపైన ఆ రక్తమేంటి?” అడిగాడు రమణ

“రండి! ఆ టీ షాపు దగ్గరకెళ్ళి మాట్లాడుకుందాం” అని రోడ్డు దాటుతూ “ఇవన్నీ మామూలే సార్! ఈ రోజు కూలీ డబ్బులు తీసుకుంటున్నారని తెలిసి వీళ్ళను ఇక్కడకు రాకుండా ఆపడానికి ప్రయత్నించాను. దాని ఫలితమే ఇది.”

“దారుణం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది”

“వాళ్లైన ఏమి చేస్తారు. ఇంకా అడ్డుకున్నందుకు నన్నే లోపలేస్తారు. అసలు ప్రభుత్వ నియంత్రణ వుంటే ఇలా వుంటుందా! సీలు వేసిన బాటిల్‌అమ్మాలి. కానీ అలా అమ్మట్లేదు. సీలు తీసి తక్కువ రకం మద్యాన్ని కలిపి లూజుగా అమ్ముతున్నారు. ఇక మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి రోజుకో రేటును నిర్ణయిస్తూ ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్ముతున్నారు. ప్రభుత్వమే చూసీచూడనట్లు వుంటోంది. ఇక నాలాంటి వారి గురించి పట్టించుకుంటారా!”  అని నిట్టూర్చాడు సూర్య.

“ఎక్సైజ్ వాళ్ళు ఏమిచేస్తున్నారు?”

“తమ ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు మాత్రం దాడులు నిర్వహిస్తుంటారు. వాళ్ళ టార్గెట్లు వాళ్ళకుంటాయి. అవి పూర్తిచేయడానికి ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. దాన్ని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత చిన్న వూరిలో నాలుగు బెల్టుషాపులు వున్నాయంటే నమ్ముతారా! వూళ్ళల్లో తాగడానికి నీళ్ళు దొరక్కపోయినా మందు మాత్రం ఇరవై నాలుగు గంటలూ దొరుకుతుంది.”

కాసేపు ఆలోచించిన తరువాత “మరి వచ్చిన కూలీ డబ్బునంతా ఇక్కడే తగలేస్తున్నారు. ఇంకేమి తింటారు?” తిరిగి అడిగాడు రమణ

సూర్య నవ్వుతూ, “భలేవారే! ఆ విషయంలో కొంత తెలివిగా వుంటారు. ప్రభుత్వం ఇచ్చే రెండు రూపాయల కిలో బియ్యం కొనడానికి సరిపడా వుంచుకుంటారు. అది కూడా చేయకపోతే వీళ్ళ పెళ్ళాళ్ళు వీరిని ఇంట్లోకి కూడా అడుగు పెట్టనివ్వరు” అన్నాడు.

“తాగి జేబులకు చిల్లుతో పాటు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారన్నమాట.”

“నయం చేసుకోవడానికి ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ వుందిగా. ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతోంది. నిజంగా ఈ బెల్టుషాపులతో పల్లెప్రజల బతుకులు చిద్రమవుతున్నాయి” 

“మరి ఎలా! ఇదంతా వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు, తమ బతుకుల్ని ఎప్పటికి సరిదిద్దుకుంటారు!” 

“వదిలేయండి సార్! ఇదంతా మానలాంటి వాళ్ళ ఆవేదనే తప్ప ఎవరికీ పట్టదు. వీళ్ళకి ఆ దేవుడే దిక్కు. వుంటాను సార్! పక్క వూళ్ళో జాతర జరుగుతోంది. వెళ్ళాలి!” అంటూ కదలబోయాడు.

“నేనూ మీతో వస్తానుండండి” అంటూ అతన్ని అనుసరించాడు రమణ. కాసేపు బస్సుకోసం వేచి చూశారు ఇద్దరూ. ఎంతకీ రాకపోయేసరికి రెండు కిలోమీటర్లే కదా నడుద్దాం అనుకొని మాట్లాడుకుంటూ నడవసాగారు.

సూర్య మాట్లాడుతూ “ ప్రతి రాజకీయ నాయకుడు మా పార్టీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తాం అంటూ వాగ్దానాలు చేస్తారు. తీరా వచ్చాక ఆ వూసే ఎత్తరు.  ఎప్పుడైనా మీలాంటి వారు ప్రశ్నిస్తే, జనాలని తాగకుండా చెయ్యలేక పోతున్నాం అంటూ మొసలి కన్నీళ్ళు కారుస్తూ, తాము చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ఇష్టానుసారంగా అమ్మకాల లైసెన్సులు ఇస్తున్నారు. తిరిగి ఆ లైసెన్సులను బినామీ పేర్లతో ప్రజా ప్రతినిధులే పోటీలుపడి దక్కించుకోవడం సిగ్గుపడాల్సిన విషయం ”

“అవునవును మద్యం టెండర్ల ద్వారా వేలకోట్ల రూపాయలు పొందుతోంది ప్రభుత్వం.”

“మరి అంత డబ్బు పెట్టి లైసెన్సు పొందిన వాడు వూరుకుంటాడా, అసలుతో పాటు లాభం రావడానికి వాడి లెక్కలు వాడికుంటాయి.”

“మన రాష్ట్రంలో బెల్టుషాపులు లక్షన్నర పైగా వున్నాయని ఈ మద్య జరిపిన సర్వేలో తేలింది” అన్నాడు రమణ.

“వుంటాయండి ఎందుకుండవు, పల్లెల్లో బడి, దవాఖానా వున్నా లేకపోయినా బెల్టుషాపు మాత్రం ఖచ్చితంగా వుంటోందిప్పుడు. ఈ షాపుల వల్ల, అందులో అమ్మే మద్యం వల్ల బలవుతోంది మాత్రం పాపం ఆడవాళ్ళే!”

“మద్యపానాన్ని పూర్తిగా నిషేదించలేకపోయినా కనీసం కట్టడి చేస్తే పరిస్థితి మెరుగావుతుంది కదా”

“అవుతుంది. కానీ కట్టడి చేసేది ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న.  మద్యాన్ని ఆదాయవనరుగా భావించే ప్రభుత్వాలు అసలు అందుకు పూనుకుంటాయా?”

అలా మాట్లాడుకుంటూ వారు జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కల్తీ సారా విచ్చలవిడిగా దొరకడం గమనించాడు రమణ. ఇక అక్కడ ఎక్కువసేపు వుండలేక తనకు కావలిసిన సమాచారాన్ని తీసుకొని బయలుదేరాడు.

“సరే, మళ్ళీ కలుద్దాం! మీతో నాకు పనిపడొచ్చు” అంటూ సూర్య నుండి ఫోన్ నెంబర్ తో పాటు సెలవు తీసుకున్నాడు రమణ. తరువాత తను కూడా ఓ షేర్ ఆటోలో ప్రధాన రహదారిపైకి చేరుకొని బస్సు కోసం చూస్తుండిపోయాడు. సాయంసంధ్య అయ్యింది. తొందరగా ఇంటికి చేరుకోవాలని మనసులో తలచాడు.

ఇంతలో ముగ్గురు యువకులు మోటర్ బైక్ పై వచ్చారు. వాళ్ళ మాటలు, భుజానికున్న బ్యాగులను బట్టి అక్కడే దగ్గరలో వున్న ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులని గుర్తించాడు రమణ.  వాళ్ళ వాలకం చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది అతనికి. ఇక వారినే గమనిస్తూ, వారి మాటలను వినసాగాడు.

“రేయ్ క్రిష్! ఎంతసేపు బస్సుకోసం వెయిట్ చేస్తావు రా! ముగ్గరం బైక్ పైన వెళ్దాం! బెట్టు చెయ్యకురా!” అన్నాడొకడు.

“నేను మీతో రాను రా!  బస్సులోనే వస్తా. వద్దని చెప్తున్నా హాట్ తాగారు. ఇప్పుడు త్రిబుల్ రైడింగ్. నాకేమో నైట్ డ్రైవింగ్ చేయడం కష్టం. లేకపోతె నేనే నడిపించేవాణ్ణి.”

“ఏమీ కాదురా! చూడు నేనెంత స్టడీగా వున్నానో!” అన్నాడు డ్రైవింగ్ సీట్లో వున్నవాడు.

“ఔను రాక్ స్టడి! అందుకే ఇందాక షాపు నుంచి వచ్చే దారిలో పడేశావు. అది చూసే నేను రానంటుంది. మీకూ చెప్తున్నా, అనవసరమైన రిస్క్ చెయ్యక బైక్ కాలేజీలో పార్క్ చేసి రండి. ముగ్గరం కలసి బస్సులో వెళ్దాం” అన్నాడు క్రిష్

“రేయ్! రేపు సండే. బైకుతో పనుంది. అందుకే దీనిపై వెళ్దామంటున్నా” 

“సరే! అందుకే మీరు వెళ్ళండంటున్నా కదా! నేను మాత్రం బస్సులోనే వస్తా!”

వింటున్నరమణకి మతి పోయింది. ఇద్దరేమో తాగున్నారు. తాగని వాడిని తమతో తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఆ క్రిష్ అనే వాడు చెప్పే మాటను మిగతా ఇద్దరు వినవచ్చు కదా! అని అనుకున్నాడు. కాలేజీలకి దగ్గరగా ఈ బెల్టు షాపులు వుండడం మూలాన ఇలాంటి వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు. మొదట్లో సరదాగా మొదలెడతారు. తర్వాత అది అలవాటుగా మారుతుంది. 

రమణ అలా ఆలోచిస్తూ వుండగా ఇంతలో ముగ్గరిలో మూడవ వాడు క్రిష్ వెనుకవైపు నుంచి వచ్చి అమాంతం ఎత్తుకుని బైక్ మీద పడేసి, “పదరా గిరి వీడు మంచిగ చెప్తే వినడు” అన్నాడు. రయ్యిమని బైకుని ముందుకురికించాడు గిరి.

“రేయ్! వద్దురా!  ఆపండిరా ప్లీజ్!” అని క్రిష్ అరుస్తుండగా రమణ ఆలోచనల నుండి తేరుకున్నాడు.  

వెంటనే “ఏయ్! వదిలేయండిరా వాడిని” అంటూ అరిచాడు రమణ. కానీ అప్పటికే బైక్ చాలా దూరం వెళ్లి పోయింది. ఇందాక వాడిని బలవంత పెట్టేటప్పుడే వారించాల్సింది. ఏంటీ కుర్రాళ్ళు! తాగి డ్రైవ్ చేస్తూ తమ జీవితాలని పణంగా పెట్టడడమే కాక ఇంకొకరి జీవితాన్ని కూడా రిస్క్ చేయడం. అసలు భయమే లేదా! అనుకున్నాడు.  ఈ లోపు బస్సు రావడం ఎక్కి కూర్చోవడం జరిగింది. మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి తనకి. 

శ్రీశ్రీ గారు అన్నది గుర్తొచ్చింది అతనికి. 'కొంత మంది యువకులు ముందు యుగం దూతలు. పావన, నవజీవన బృందావన నిర్మాతలు…' అన్నారు శ్రీశ్రీ.  

కానీ ఇందాకటి ఆ తాగిన కుర్రాళ్ళని చూస్తే ‘కొంత మంది యువకులు మందు తాగుబోతులు అనిపిస్తుంది.' అలాంటి బాద్యత లేని వారితో నవ భారత నిర్మాణం ఎలా జరుగుతుంది అనుకున్నాడు.

రమణ సిటి బస్సు దిగి తన కాలనీ వైపు వెళుతున్నాడు. కాలనీ మొదట్లో అలజడిగా వుంది. అది వైన్ షాప్. దాని ముందు మందు కోసం ఎగబడుతున్నారు జనం.  ప్రతి వారాంతం ఇలాగే వుంటుంది. మళ్ళీ తనకి శ్రీశ్రీ కవిత్వం గుర్తొచ్చింది. 

‘మరోప్రపంచం మరోప్రపంచం మరోప్రపంచం పిలిచింది. పదండి ముందుకు. పదండి తోసుకు. పదండి పోదాం పైపైకి’’- అంటూ విప్లవ శంఖం పూరించాడు మహాకవి శ్రీశ్రీ.

కానీ ఈ దృశ్యం చూస్తూంటే  ‘మత్తు ప్రపంచం పిలిచింది. పదండి మందుకు, పదండి బీరుకు, పదండి విస్కీకి’ అని తొందరగా తమకు కావల్సినది కొనుక్కొని అంతే తొందరగా నిషాలోకి జారిపోదామనుకుంటున్నట్టు అనిపించింది రమణకి.

చాలా మంది అక్కడే ఫుట్పాత్పై కూర్చొని తాగి బాటిళ్ళను రోడ్లపై చెల్లాచెదురుగా పడేస్తుంటారు. ఇక పీకలదాకా తాగిన మందుబాబులు రోడ్లకు అడ్డుగా తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించడమే కాకుండా అక్కడి ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు కూడా. ఒకట్రెండుసార్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు రమణ. పోలీసులు రావడమేమో వస్తారు. రాగానే కాస్త హడావుడి చేసి వెళ్తుంటారు. మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలే!

తన ఇంటికి చేరువవుతుండగా వాళ్ళింటి పక్క పోర్షన్లో వుండే యాదవ్ ఎదురయ్యాడు. హాయ్ అంటూ పలకరించాడు. తను కూడా పలకరిస్తున్నట్టు చెయ్యి వూపాడు. యాదవ్ వెళ్తోంది మందు షాపుకేనని గ్రహించాడు రమణ.

కాలింగ్ బెల్ నొక్కగానే రమణ భార్య పద్మ వచ్చి తలుపు తీసింది. లోపలికి అడుగు పెట్టగానే “బాబూ పడుకున్నడా" అని తన రెండేళ్ళ కొడుకు గురించి  అడిగాడు.

"ఆ! మీ గురించి చూసి చూసి ఇందాకే పడుకున్నాడు.” అన్నదామె.

రమణ స్నానం చేసి రాగానే భోజనం వడ్డించింది. భోజనం ముగించి  టీవీ చూడసాగాడు.  ఓ ఛానల్లో ప్రతిపక్షానికి చెందిన ఓ రాజకీయనాయకుడు తన అనుచరులతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినందుకు నిరసనగా ధర్నా చేస్తుండడం చూపిస్తున్నారు. ఇంకో ఛానల్లో అదే రాజకీనాయకుడు జరుగుతున్న ధర్నాకు జనాలను ఎలా పోగేసింది, వారికి మందు బాటిళ్లని ఎలా పంచింది చూపిస్తున్నారు. టక్కున టీవీ ఆపేసి రిమోట్ పక్కన పడేశాడు. ఒకరేమో ధర్నా ఎంత జయప్రదంగా జరిగింది చూపిస్తుంటే ఇంకొకరేమో జనాలను ఎలా ప్రలోభ పెట్టి విజయవంతం చేసుకున్నది చూపిస్తున్నారు. చూసేవాళ్ళు దేన్ని నమ్మాలి.  ప్రజలు అయోమయానికి గురవుతుంటే దాన్ని ఆసరాగా తీస్కొని  తమ పబ్బం గడుపుకుంటున్నాయి రాజకీయపార్టీలు. జనాలు ఈ వాస్తవం గమనిస్తున్నారా అసలు అని ఆలోచించసాగాడు.

ఇంతలో పక్క పోర్షన్లోంచి అరుపులు వినపడ్డాయి. ఇక మొదలెట్టాడు యాదవ్ అనుకున్నాడు రమణ. వారంలో కనీసం రెండుసార్లయిన ఈ సీన్ వుంటుంది. తాగడం భార్యతో గొడవ పెట్టుకోవడం యాదవుకు అలవాటుగా మారింది. ఎంత వినకూడదనుకున్నా తప్పట్లేదు. 

“ఏమే! చికెన్ తెచ్చి వండమని పొద్దున నీకు పైసలు ఇస్తిని కదా! ఎందుకు వండలేదే” అంటూ గట్టిగా కొట్టినట్టు వినపడింది.

“అది కాదండి! పాపకు పొద్దుటి నుంచి జ్వరంగా వుంటే డాక్టరుకు చూపించి మందులు తెచ్చాను. అందుకే పైసలు అయిపోయాయి. ఈ పూటకి ఈ గుడ్డుతో సరిపెట్టుకోండి” అంది యాదవ్ భార్య

“గా ముక్క నేను దుకాణమ్కి వెళ్ళక ముందు చెప్పాలే. మందు కొట్టినాక గింక యాదుండదూలె అని అనుకొన్నావులే. నా కెరుకనే నీ దొంగ జిత్తులు” అని మళ్ళీ కొట్టసాగాడు. 

అమ్మా! చంపేస్తున్నాడు అంటూ దెబ్బలకు తట్టుకోలేక అరవసాగింది యాదవ్ భార్య.

నిజంగా చంపేటట్టు వున్నాడని వెళ్లి “ఏయ్ యాదవ్! తలుపు తెరువ్” అంటూ వాళ్ళింటి తలుపు బాదాడు రమణ. రెండు నిమిషాల తరువాత తలుపులు తెరచుకున్నాయి. యాదవ్ బయటకు వచ్చి అడిగేలోపే ఏమీ ఎరుగని వాడిలా చక చక వెళ్ళిపోయాడు. పద్మ లోనికి వెళ్లి యాదవ్ భార్యను సముదాయించింది. అక్కడే కాసేపుండి తిరిగి వచ్చేసారు ఇద్దరూ. ఇలా ఈ మధ్యన తరుచుగా జరుగుతోంది.

రమణ పడుకొని ఆలోచిస్తున్నాడు. సాయంత్రం నుండి జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. యాదృచ్చికంగా అన్నీ మద్యంకు సంబందినవి కావడం ఆశ్చర్యం వేసిందతనికి. అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ ఆ రోజు దినపత్రిక తిరగేస్తున్నాడు రమణ. “జాతరలో నకిలీ మద్యం” అన్న హెడ్డింగ్ అతని కంట పడింది.  వార్తను పూర్తిగా చదివాడు. అరే! జాతర జరిగిన వూరు నిన్న తను వెళ్ళిన వూరేనని గ్రహించాడు. నకిలీ మద్యం తాగి పాతికమంది దాక ఆస్పత్రి పాలయ్యారు అని వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వుందని రాశారు. తాగిన వాళ్ళల్లో చాలా మంది కూలీలే అని వ్రాసుంది. మనసంతా బాధగా అనిపించింది రమణకి.

కాసేపయ్యాక టీవీ ఆన్ చేశాడు. ఓ ఛానల్లో తాగి మోటర్ బైక్ నడుపుతూ ప్రమాదానికి గురైన విద్యార్థులు. వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించిన స్థానికులు అని స్క్రోలవుతోంది. మీడియాలోని స్నేహితుల ద్వారా వాకబు చేయగా ఆ విద్యార్థులు నిన్న సాయంత్రం తను చూసిన వారేనని తెలిసింది. వీళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి తలుచుకుంటే మరింత బాధ అనిపించింది అతనికి.  ఇంతలో ఇంటి తలుపు ఎవరో కొడుతున్నట్టనిపించి వెళ్ళి తీసాడు. 

ఎదుట కంగారుగా యాదవ్. 

“సార్ మా ఆవిడ మీ ఇంటికి వచ్చిందా!” అడిగాడు యాదవ్.

“లేదే! రాలేదు” అంటూ ఏమైందని ప్రశ్నించాడు రమణ.

“అయ్యో! ఇంటికి ఇప్పుడే వచ్చి చూస్తే లేదు. పాప కూడా కనిపించట్లేదు. నాకు భయమేస్తోంది సార్!  ఏమి చేయాలో తెల్వట్లేదు” అంటూ ఏడుపు మొఖం పెట్టాడు.

“రాత్రి తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాదావ్. మనిషిలా ప్రవర్తించావా నీవసలు! చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి చేయాలో తెలియటం లేదు అంటున్నావు” కోపంతో అరిచాడు రమణ.

“తప్పయింది సార్. మీరు పేపరోళ్ళు కదా! మీకు పోలీసులతో దోస్తు వుంటది. వాళ్లకి చెప్పి ఏదన్న చెయ్యండి సార్!” వేడుకున్నాడు యాదవ్

కోపాన్ని అణుచుకుంటూ “సరే! ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అని నీవు కూడా నీ బంధువుల ఇల్లకేమైన వెళ్ళిందేమో కనుక్కో అన్నాడు.”

అలా రెండు గంటలు వెతగ్గా యాదవ్ భార్య తనకు పిన్ని వరసయ్యే వాళ్ళింట్లో వుందని తెలుసుకున్నాడు. యాదవ్ తన భార్యను బ్రతిమాలి, బామాలి ఇంకోసారి చెయ్యను అని కట్ట మైసమ్మ మీద ఒట్టేసి ఇంటికి తెచ్చుకున్నాడు. 

ఆమె ఎలాంటి అఘాయిత్యం చేసుకోనందుకు వూపిరి పీల్చుకున్నారు రమణ దంపతులు.

నిన్న జరిగిన సంఘటనలకు పర్యవసానాలు ఈ రోజు కనిపించాయి రమణకి. వీటన్నింటికి బాద్యులు ఎవరు? పభుత్వమా! రాజకీయనాయకులా! ప్రజలా! వ్యవస్థనా! ఎంత ఆలోచించినా జవాబు దొరకట్లేదు అతనికి. ఇంతలో టీవీలో వచ్చే పాట అతని ఆలోచనలకు అంతరాయం కలిగించింది.

"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్నిమారదు లోకం మారదు కాలం 
దేవుడు దిగి రాని , ఎవ్వరు ఏమైపోనీ ... మారదు లోకం మారదు కాలం"  ఇలా సాగుతోంది పాట.....


పాటలోని కవి మాటలు రెచ్చగొట్టాయి రమణని. లేదు మారాలి. కానీ ఎవరు మారాలి? ఎలా మారాలి? ఆలోచించసాగాడు. చివరికి అతని ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వ దృక్పథం మారాలి. రాజకీయనాయకుల తీరు మారాలి. ప్రజల ఆలోచనలు మారాలి. మొత్తంగా ఈ వ్యవస్థలోనే మార్పు రావాలి అనుకుంటూ, పెన్నూ, పేపర్ తీసుకున్నాడు. రాయడం మొదలు పెట్టాడు. మద్యం-బెల్టుషాపులు, వాటికి ఆకర్షితులవుతున్న జనం, ఆదాయం పెంచుకోవడానికి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, బుగ్గిపాలవుతున్న బతుకులు. 

ఎలా నియంత్రించాలి, ప్రజల్ని ఎలా చైతన్య పరచాలి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను ఎలా సమకూర్చుకోవాలి అంటూ దానికి ఉదాహరణగా అపార ఖనిజ సంపాదకు నిలయమైన మన రాష్ట్రం, వాటిని తవ్వుకోవడాన్ని ప్రయివేట్ వ్యక్తులకు లీజు కిచ్చి వారిని కోటీశ్వరులను చేయడం కన్నా ప్రభుత్వమే తవ్వి అమ్మగా వచ్చిన సొమ్ముతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యచ్చో చెబుతూ మొత్తం పది పేజీల వ్యాసాన్ని ఆ అర్థరాత్రికి  తయారుచేశాడు. దానికి ‘మార్పు కోసం’’ అన్న టైటిల్ పెట్టాడు. దీన్ని తన పత్రిక సబ్-ఎడిటర్ తో ఓకే చేయించి పత్రికలో వచ్చేట్టు చేయాలనుకుంటూ నిద్రకుపక్రమించాడు. 

మరుసటి రోజు రాసిన దాన్ని సబ్-ఎడిటర్ టేబుల్ ముందుంచాడు రమణ. 

దాన్ని చూడగానే తిరస్కారంగా పక్కన పడేస్తూ, “నీకు ఇచ్చిన పనేంటి! నీవు తెచ్చినదేంటి!” అన్నాడు

“సార్! అది కూడా తయారుచేశాను. ఇది దాని కంటే ముఖ్యమైనది. ముందు దీన్ని ప్రచురిస్తే రెస్పాన్స్ బాగుంటుంది” అని ఒప్పించ ప్రయత్నం చేశాడు. 

“అన్నీ నువ్వే చెప్పి, నువ్వే డిసైడ్ చేస్తే ఇక నేనెందుకు! రెండూ అక్కడ పెట్టేసి వెళ్ళు” అన్నాడు సబ్-ఎడిటర్.

సాయంత్రం వరకు వేచి చూశాడు సబ్-ఎడిటర్ పిలుస్తాడేమోనని! అదేమీ కనిపించకపోవడంతో తనే వెళ్ళాడు.

ఇది అవసరం లేదని తను మాద్యంపై వ్రాసిన దాన్ని తిరిగిస్తూ, “చూడు మనది చిన్న పత్రిక. సర్క్యులేషన్ పెరగాలంటే మనకు ఎప్పుడూ సెన్సేషన్ న్యూస్ కావాలయ్య. ఇలాంటివి ఎవడు చదువుతాడు. దీన్ని తీసుకుని వెళ్ళి మీ అబ్బాయికి ఇచ్చేయ్! కాగితం పడవలు చేసుకుని ఆడుకుంటాడు” అని తన పనిని చేసుకోసాగాడు.

ఇక ఏమి మాట్లాడాలో తెలీయక బయటకు వచ్చాడు రమణ. ఆఫీసులో వుండాలనిపించలేదతనికి. ఇంటికొచ్చేసాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఇక పని చేయాలనిపించలేదతనికి. ఆఫీసుకు వెళ్లడం మానేసాడు. రెండు రోజుల తరువాత తన రాజీనామా పంపించాడు.  

మళ్ళీ ఉగ్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాలా ఇప్పుడు అని తలచాడు. కానీ ఎక్కడకిపోయినా ఇంతేనేమో,  రాజీపడుతూ బ్రతకడం తప్పదా అని మనసులోనే కుమిలాడు. పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి తప్పదు అని ఘోషిస్తోంది అతని అంతరాత్మ. 

అలా నెల రోజులు గడిచాక ఓ రోజు అతని సెల్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి ‘హల్లో’ అన్నాడు. ఫోన్ చేసిన వారు తనని పరిచయం చేసుకుని చెప్పాల్సింది చెప్పేసి పెట్టేశారు. 

“పద్మా గుడ్ న్యూస్!” అంటూ ఇందాక ఫోన్ చేసింది ప్రముఖ దినపత్రిక ఛీఫ్ ఎడిటర్ అని, రేపు వచ్చి కలవమన్నాడని తన భార్యతో చెప్పాడు.

మరుసటి రోజు వెళ్ళి ఛీఫ్ ఎడిటరిని కలిశాడు. “నీవు ఇప్పటివరకు రాసిన వాటిల్లో 'ది బెస్ట్' ఏది?” అని అడిగాడు ఛీఫ్ ఎడిటర్

తనతో పాటు తీసుకొచ్చిన 'మార్పు కోసం' అతనికిచ్చి “దీన్ని ఒకసారి చదవండి సార్!” అన్నాడు రమణ

“సరే! వెయిట్ చెయ్యి. చదివి నా అభిప్రాయం చెప్తా” అన్నాడు ఛీఫ్ ఎడిటర్.

గంట తరువాత రమణని పిలిపించుకుని “చాలా బాగా రాశావు” అని మెచ్చుకొని “నీలాంటి వాడి కోసమే ఎదురుచూస్తున్నాము. నీవు రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించమని ఇప్పుడే పంపిస్తాను. నీవు కోరుకుంటున్న మార్పుకై కలసి పని చేద్దాం. రేపే జాబులో జాయినవ్వు.” అన్నాడు. 

అంధకారంలో వున్న వాడికి దివిటీలా, నాలుగు రోడ్ల కూడలిలో ఎటు వెళ్ళాలో తెలియక నిలుచున్న వాడికి దిక్సూచిలా అగుపించింది రమణకి అతడిచ్చిన ఆ అవకాశం. 

------------------------------------------------------------సమాప్తం---------------------------------------------------------------

Wednesday 9 May 2012

భూమి కోసం!

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక మంది వీరులు తమ ప్రాణాలను పణంగాపెట్టి బ్రిటిష్ సైన్యంతో పోరాడారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు.
కథకుడు: అరెరెరె...................... థా త ధికితటథా
           వినరా సోదరా వీర కుమారా
           భారతయోధుల గాథలు
వంత:     తందానా, తందాన దేవనందనానా
కథకుడు: ఉన్నా రెందరో వీరులు
           వారిలో ప్రాతస్మరణీయుడు
           సువిశాలాంధ్రకు విప్లవజ్యోతి
           సీతారామరాజు అల్లూరి సీతారామరాజు
           నవచైతన్య చేకేతన మార్గ దర్శకుడు
           సీతారామరాజు మన సీతారామరాజు
అంటూ అతడు రగిలించిన విప్లవాగ్నిని, బ్రిటిష్ సైన్యంతో జరిపిన పోరాటాన్ని స్మరింప చేస్తూ స్వాతంత్ర్యదినోత్సవ  వేడుకలలో తన దగ్గర చదివే పిల్లలతో బుర్రకథగా చెప్పిస్తోంది మహిమవేడుకలకు విచ్చేసిన గ్రామ ప్రజలు పిల్లల ప్రతిభను చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు.

బోలో స్వతంత్య్ర భారత్‌కీ జై!                                                                                        
జై హింద్! ...........అంటూ ముగించారు పిల్లలు.

ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారు మ్రోగింది

మహిమ బావ పృధ్వీ ఆమె దగ్గరకు వెళ్ళి కంగ్రాట్స్ మహీ! పిల్లలతో చక్కగా చేయించావు. నిజంగా సినిమా చూస్తున్నట్టు అనిపించింది అంటూ అభినందించాడు.

థాంక్స్ బావా! అంది మహిమ 

మహిమ అక్కడి మండల పరిషత్ స్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. ఆమె బావ పృధ్వీరాజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ ప్రస్తుతం అమెరికాలో వుంటున్నాడు. సెలవుపై తన సొంతవూరు వచ్చాడు. ఎప్పటికైనా తన స్వగ్రామానికి శాశ్వతంగా తిరిగి వచ్చి సొంతగా స్కూలును ఏర్పాటు చేసి ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలలోని పిల్లలకు తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా నాణ్యమైన చదువు అందించాలని అతని ఆశయం. విధంగా జన్మభూమి ఋణం తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకై  తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. తమ పది ఎకరాల భూమి పక్కనే మరో ఐదు ఎకరాలు కొనుగోలు చేయడానికొచ్చాడిప్పుడు. తమ పూర్వీకుల నుండి సంక్రమించిన పది ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ కొత్తగా కొన్న ఐదెకరాలలో స్కూలు భవనాన్ని, ఆటస్థలాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడులక్షలు కురిపించే ఉద్యోగాన్ని వదిలేసి పల్లెకు వచ్చి బడి పెట్టాలనుకుంటున్నాడు, వీడికేమైనా పిచ్చా లేక వెర్రా అని పృధ్వీ ఆశయాన్ని హేళన చేసినవారూ వున్నారు. వీటిని లెక్క చేయక తన ఆశయసాధనలో పూర్తిగా నిమగ్నమయ్యాడు పృధ్వీ.

ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చాక తనను ఇష్టపడి, తన ఆశయాన్ని గౌరవిస్తూ, ఇంకెవరినీ పెళ్ళిచేసుకోకుండా తన కోసమే వేచి వున్న తన మరదలిని పెళ్ళి చేసుకొని జీవితంలో పూర్తిగా స్థిర పడాలనుకున్నాడు పృధ్వీ.

రిజిస్ట్రేషన్ పనులయ్యాక అమెరికాకు తిరుగు పయనమవుతున్నాడతను.

మహిమ కంట నీరు చూసి, ఇంకెంత! నాలుగు నెలలేగా! వచ్చే జనవరికి తిరిగి వచ్చి జూన్ కంత మన స్కూల్ మొదలెట్టాక ఇక నీ మెడలో మూడుముళ్ళు వేయడమే! అన్నాడు పృధ్వీ.

సరే బావ! ఆల్ ద బెస్ట్! అంటూ సాగనంపింది మహిమ.

చెప్పినట్టుగానే నాలుగు నెలల తరువాత శాశ్వతంగా తిరిగి వచ్చి ప్రభుత్వం నుండి అనుమతులు పొంది తన సొంత స్కూల్ భవన నిర్మాణం చేపట్టాడు పృధ్వీ. మూడునెలల్లో ముప్పావు వంతు పూర్తయింది. ఇక ఒక నెలలో మిగిలినది కూడా పూర్తవుతే జూన్ నుండి మొదలయ్యే విద్యా సంవత్సరంతో స్కూలు ప్రారంభించవచ్చని భవన నిర్మాణం ముందు నిల్చున్న పృధ్వీ పక్కనున్న తన మరదలితో అన్నాడు. అదే జరిగితే వచ్చే శ్రావణమాసంలో తన బావతో పెళ్ళవుతుందని మనసులోనే మురిసిపోయింది మహిమ.

ఇంతలో పృధ్వీ వాళ్ళ నాన్న వెంకటయ్య రొప్పుకుంటూ వచ్చి, నాయనా పృధ్వీ ఇది చూడు, ఇప్పుడే మండల ఆఫీసరిచ్చి వెళ్లారు! అని తన చేతిలోని పేపరును అందించాడు

అది ప్రభుత్వ నోటీసు. చదువుతున్న పృధ్వీ మోములో రంగులు మారుతున్నాయి. పూర్తిగా చదివాక హతాశుడయ్యాడతను

ఏమైంది బావా అలా అయిపోయావు!” అడిగింది మహిమ

ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రెండు వేల ఎకరాలను ప్రత్యేక ఆర్ధిక మండలికి కేటాయించిందట ప్రభుత్వం. దీనికి సంబంధించిన హక్కుదారులు తమ భూములను ప్రభుత్వాధీనం చెయ్యమని నోటీసు పంపించారుచెప్పాడు పృధ్వీ.

విన్న మహిమ విస్తుపోతూ, అందులో మన భూమి కూడా వుందా! అడిగింది సందేహంగా.
 
అవునన్నట్టు తలూపాడు పృధ్వీ

తన ఆశలు, తన బావ ఆశయాలు ఉప్పెనలో కొట్టుకుపోతునట్టు అనిపించింది మహిమకు.  

ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో గ్రామం చేరారు వారు. అప్పటికే గ్రామంలో కలకలం మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న చర్యకు అంతటా వ్యతిరేకత వ్యక్తమైందితరతరాలుగా పంటలు పండించుకుంటూ బతుకుతున్న వారి జీవనాధారాన్ని అప్పగించాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని ఆ గ్రామ రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒకొక్కరు వచ్చి రచ్చబండ దగ్గర గుమిగూడారు. అందరి మొఖాల్లో ఆందోళన. అక్కడున్న అందరిలో చదువుకున్న వాడు పృధ్వీ ఒక్కడే. అందరి తరుపున పృధ్వీని మండల రెవెన్యూ అధికారితో మాట్లాడమని కోరారు

ఆ మరుసటి రోజు మండల రెవెన్యూ అధికారితో మాట్లాడడానికి వెళ్ళాడు పృధ్వీ. ఎంతసేపూ ప్రభుత్వ ఉత్తర్వులను చదివి చెబుతాడే కానీ, ప్రభుత్వం దేనికొరకు భూమిని సేకరిస్తోందో సరిగా చెప్పలేకపోయాడు 

ఇలా కాదని సమాచార హక్కు చట్టం ద్వారా అసలు విషయాన్ని రాబట్టాడు పృధ్వీ.

రసాయన పరిశ్రమ స్థాపించడానికి ఒక బహుళజాతి సంస్థకు ప్రత్యేక ఆర్ధిక మండలి ద్వారా తమ నుండి సేకరించిన భూమిని అప్పగించడానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్న విషయం తెలిసింది.

సేకరించిన సమాచారంతో తిరిగి మండల రెవెన్యూ అధికారి దగ్గరకు రైతులు, రైతు కూలీలతో సహా చేరాడు పృధ్వీ. మా భూములను లాక్కొని విదేశీ సంస్థకు కట్టబెట్టడానికి మీకేమి హక్కుంది అని నిలదీశాడు.

ఆ హక్కును ‘2005 ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ చట్టం’ ఇచ్చింది అని బదులిచ్చాడు అధికారి.

ప్రజల బాగు కోసం చట్టాలను రూపొందించాలి. ఇలా వారి భూముల్ని లాక్కొని నిరాశ్రయులను చేయడానికి చట్టాలు చేస్తారా! అడిగాడు పృధ్వీ

చూడు, నేను ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలుపరిచే వాడినే కాని, చట్టాలను తయారుచేసే వాణ్ణి కాదు. నీకేమైనా అభ్యంతరాలుంటే పోయి వీటిని తయారుచేసిన వాళ్ళను అడుగు అన్నాడు మండల రెవెన్యూ అధికారి.

మేము వెళ్లడం కాదు వాళ్లనే ఇక్కడకు రప్పించి ఈ దగాకోరు ఒప్పందాన్ని రద్దు చేయిస్తాం అంటూ ఆవేశంగా బయటకు వచ్చాడు పృధ్వీ.

మండల రెవెన్యూ కార్యాలయం ముందు అందరూ కూర్చొని శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఆ ధర్నా వారం రోజులు కొనసాగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిస్పందన లేకపోగా గడువులోగా భూములను అప్పగించి నష్టపరిహారం పొందాలని లేకపోతే కఠినచర్యలు తీసుకుంటామని మరొకసారి నోటీసులు పంపించింది. మా భూముల్ని ఇచ్చేది లేదంటూ తమ ధర్నాను కొనసాగించారు రైతులు

గడువుతేదీ రానే వచ్చింది. రైతుల నుండి బలవంతంగానైనా భూమి స్వాధీనం చేసుకోవడానికి మందీమార్బలంతో వచ్చారు అధికారులు. పృధ్వీ ఆద్వర్యంలో దీన్ని ప్రతిఘటించారు రైతులు. పృధ్వీతో సహా కొంతమంది ముఖ్య రైతులను నిర్భందించారు పోలీసులు. దీంతో మరింత రెచ్చిపోయారు రైతులు, రైతుకూలీలూ. సమీపంలోని జాతీయరహదారిపై రాకపోకలను స్తంభింపజేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయించారు స్థానిక అధికారులురహదారుల నిర్భందాన్ని ఇలాగే కొనసాగించితే  ప్రభుత్వమే దిగివస్తుందని మరింతగా ఉద్యమించారు రైతులు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సాయుధబలగాలు రైతులపై విరుచుకుపడ్డాయి. అందరి ముందున్న పృధ్వీని చుట్టుముట్టి తమ లాఠీలకు పనిచెప్పారు పోలీసులు. ఆ దెబ్బలు తట్టుకోలేక నేలపై పడ్డాడు పృధ్వీ. దీన్ని చూసిన రైతులు తమ చేతికందిన వాటిని పోలీసులపైకి విసిరారు. చేయిదాటిపోతున్న స్థితిలో కాల్పులు జరపడం మొదలెట్టారు పోలీసులు. కాల్పులు ఆపమని నేలపైపడి పైకి లేవలేని స్థితిలోవున్న పృధ్వీ పోలీసులను ప్రాధేయపడ్డాడు. కానీ వారు కనికరించలేదు. అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. భయాందోళనతో పొలం గట్ల వెంట పరుగులు పెట్టారు గ్రామ ప్రజలు

అరగంట తరువాత క్షతగాత్రులై కొందరు, విగతజీవులై నలుగురు రైతులు పొలాల్లో పడివున్నారు. నీరు పారాల్సిన చోట నెత్తురు పారింది

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పృధ్వీ రెండురోజుల తరువాత కన్ను తెరిచాడు. తన మంచం పక్కన కన్నీళ్ళతో అతని అమ్మానాన్నలు, మరదలు మరియు మిగతా బంధువులు వున్నారు

వద్దు నాయనా! బడి వద్దు, ఏమీ వద్దు!. ఉద్యోగంలో చేరి, పెళ్ళి చేసుకొని హాయిగా వుండు. ఈ ముసలితనంలో ఉన్న ఒక్క కొడుకుకు ఏమైనా అయితే తట్టుకుని మేము బ్రతకలేము అన్నాడు పృధ్వీ నాన్న వెంకటయ్య

పృధ్వీ పెదవి తెరిచే లోపలే మహిమ చాలు బావ! ఈ సమాజ సేవ! నువ్వు చెప్పేది మేము వినడం కాదు, మేము చెప్పేది నువ్వు వినాలిప్పుడు అంది

ఏమి మాట్లాడుతున్నావు! ఇప్పుడు నేను వెనకడుగు వేసి ఉద్యోగంలో చేరగలను. కానీ మిగతావారి పరిస్థితేంటి! కాల్పులలో చనిపోయిన వారి ప్రాణత్యాగానికి అర్థముంటుందా! ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసే వరకు విరమించేది లేదు నిక్కచ్చిగా చెప్పాడు పృధ్వీ.

ఆసుపత్రిలో వున్నన్ని రోజులు ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ గురుంచి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. పది రోజుల్లో పూర్వ స్థితికి వచ్చాడు పృధ్వీ

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఈసారి కలక్టరేట్ ముందు ధర్నా ప్రారంభించారు. పదుల సంఖ్యతో మొదలైన ధర్నా రెండు రోజులకు వందలు, మరో రెండు రోజులకు వేలాది మందితో కొనసాగింది

రైతులతో మాట్లాడి మొత్తం వ్యవహారంపై నివేదిక పంపమని ప్రభుత్వం కలెక్టరును ఆదేశించింది. పృధ్వీని మరికొంతమందిని చర్చలకు ఆహ్వానించారు కలెక్టర్. ఆయనే ఇక్కడకు వచ్చి అందరిముందు మాట్లాడాలని పట్టుబట్టారు రైతులు

కలెక్టర్ ధర్మతేజ వారి దగ్గరకు వచ్చి ఏమిటి మీ డిమాండ్లు? అని అడిగారు

మా దగ్గర ఎలాంటి డిమాండ్లు లేవు సార్! మా జీవనోపాధిని కొల్లగొట్టే ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తున్నాము. విదేశీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోమని వేడుకొంటున్నాముఅన్నాడు పృధ్వీ

ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది కదా! వచ్చే పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తుంది.

తరతరాలుగా నేలతల్లిని నమ్ముకొని స్వేచ్ఛగా బ్రతుకుతున్న మమ్మల్ని పరిశ్రమలల్లో కూలీలుగా చేరమంటారా! అయినా ఇతర ప్రాంతాలలో ఇప్పటివరకు రైతుల నుండి తీసుకున్న భూమిలో ఎంతమందికి ఉపాధి కల్పించారు సార్! వాస్తవానికి చాలా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమై రియల్‌ఎస్టేట్‌ కేంద్రాలుగా మారుతున్నాయని వినికిడి. కాదంటారా! ప్రశ్నించాడు పృధ్వీ.

మరి పారిశ్రామికంగా అభివృద్ది ఎలా సాధ్యపడుతుంది ఎదురు ప్రశ్నించారు కలెక్టర్ ధర్మతేజ 

బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు రైతుల పచ్చని పొలాలను ధారాదత్తం చేసి మాత్రం కాదు అన్నాడు పృధ్వీ.

ఇక్కడ ఎవరితో పారిశ్రామికాభివృద్ది జరుగుతుందో మీకనవసరం. ఇక్కడి జనాలకు ప్రయోజనంతో పాటు, ఈ ప్రాంత అభివృద్ధి జరుగడమే ముఖ్యం

మీ దృష్టిలో అభివృద్ధి అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (స్పెషల్ ఎకనామిక్ జోన్స్-SEZ)  పేరిట  విద్యుత్ పరిశ్రమలు, రసాయన కర్మాగారాలు, అణువిద్యుత్ కేంద్రాలను స్థాపించడమేనా సార్! అందులోనూ విదేశీ సంస్థలతో చేతులు కలిపి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సార్వభౌమత్వానికి విఘాతంగా పరిణమిస్తాయి ఇవి. అందుకే ఈ ప్రతిఘటన సార్!

దూరంగా వుండి తన బావ మాటలు వింటున్న మహిమకు ఆక్షణాన పృధ్వీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజులా అగుపించాడు ఆమె కళ్ళకి.

అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళ వలన అసలు లాభాలే లేవంటావా! అడిగారు కలెక్టర్.

లాభాల మాటేమో గానీ నష్టాల గురించి మాత్రం చెబుతాను. అనాదిగా ఈదేశంలో ముప్పావువంతు జనాభా నేలతల్లిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ వల్ల కనీసం ఇందులో సగం మంది రైతులు తమ అస్థిత్వాన్ని కోల్పోతారు. ఇళ్లూ, పొలాలు, వూళ్ళు పోగొట్టుకొని బికారుల్లాగా మారుతారు. ఒక ఇంటిలో ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తారు. మహా అయితే ఒక్కరికి లేదా ఇద్దరికి. అదే పొలం వుంటే ఇంటిల్లిపాదీ కష్టపడతారు. దేశానికి తిండి గింజలను అందిస్తారు.

ఇక పర్యావరణం. పచ్చటి నేల బూడిదతో బుగ్గి కాబడుతుంది. అడువులు నరికివేయబడతాయి. అడివితల్లిని నమ్ముకొని బతికే గిరిజనులు, జంతువులు జీవించే హక్కును కోల్పోతారు. రసాయన పరిశ్రమలవల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ఈ పరిశ్రమలు వెదజల్లే పొగ వల్ల పీల్చేగాలి కాలుష్యం అవుతుంది. రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్యసంపదకు నష్టం వాటిల్లుతుంది. దానిపై బతికే మత్స్యకారుల గతేమి కావాలి, చెప్పండి సార్! అన్నాడు పృధ్వీ.

పరిశ్రమల స్థాపన ఆపేద్దామా! ఈ ప్రాంత అభివృద్దిని ఆపేద్దామా! అడిగారు కలెక్టర్

అభివృద్ధి, అభివృద్ధి అంటున్నారు. అసలు మన గ్రామాలు ఇప్పటివరకు ఏమి అభివృద్ధి సాధించాయి సార్! ఆసుపత్రులు వుంటాయి కానీ డాక్టర్లు వుండరు. వున్నా మందులుండవు. బడి వుంటుంది కానీ అది పేరుకే! పైకప్పు ఎప్పుడూ కూలుతుందో తెలీదు. అన్నీ వున్నా టీచర్లు వుండరు. రోడ్లు వుండవు, వున్నా దుమ్ము కొట్టుకొని వుంటాయి. వాటిపై నడవడానికి బస్సులుండవు. సరైన మరుగుదొడ్లు లేక ఆడవారు చెంబు పట్టుకొని వెళుతున్నారు. ఎంత సిగ్గుచేటు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి అరవై సంవత్సరాలు దాటినా ఇంకా ఇలాంటి కనీస మౌలికసౌకర్యాలకే గతి లేదు. ఇక ఎప్పుడో జరిగే అభివృద్ధి గురించి భరోసా ఎలా కలుగుతుంది సార్! చెప్పండి! అంటూ నిలేసాడు పృధ్వీ.

వెంటనే చప్పట్లు, కేకలు, ఈలలు మ్రోగాయి అక్కడ. ఇలా అడిగేవాడు ఊరికోక్కడు వుంటే చాలు దేశం ఎప్పుడో బాగుపడేది అనుకున్నారందరూ.

మరి పారిశ్రామికాభివృద్దిలో దేశం వెనకపడుతుంటే చూస్తూ వూరుకోమంటావా! ప్రశ్నించారు కలెక్టర్

ఎందుకు వెనకపడాలి. పారిశ్రామికాభివృద్ది కూడా జరగాలి. కానీ ఇలా పచ్చటి పోలాల్లో కాదు. భూమి సాగులో లేని చోట, బంజరు భూముల్లో జరిగితే మీరన్నట్టు అక్కడి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అది కూడా బహుళజాతి కంపెనీలతో కాదు, మన స్వదేశీ కంపెనీలతో జరగాలి. అందుకు కావలిసిన పరిజ్ఞానాన్ని అక్కడి ప్రజలకు అందించాలి. మనకు మానవ వనరులు అపారంగా వున్నాయి. మన మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు తాము పొందిన విజ్ఞానాన్ని ఇక్కడి ప్రాంత ప్రజల అభివృద్ధికి వినియోగిస్తే మనదేశం అభివృద్ధి చెందిన దేశాలలో మొదటి స్థానం పొందుతుంది.

చివరగా మేము చెప్పదలచుకున్నది ఒకటే సార్! భూమిని తల్లిగా భావించే మనదేశంలో ఆ భూమాత తన పిల్లల సంరక్షణలో వుండాలా లేక ఇక్కడి వనరులను కొల్లగొట్టే వారి చేతుల్లో బందీ అవ్వాలా? అలా బందీ అవ్వాలని మీరు నిర్ణయిస్తే మా ప్రతిఘటన కూడా ఇలాగే వుంటుంది. లేకపోతే రాబోయే తరాలు మమ్మల్ని క్షమించవు. మా వాదన ఇంతవరకు ఓపికతో సావధానంగా విన్నందుకు ధన్యవాదాలు అంటూ నమస్కరిస్తూ ముగించాడు పృధ్వీ.

మరొక్కసారి చప్పట్లు మోగాయి.

కలెక్టర్ ధర్మతేజ, మీ వాదనను ప్రభుత్వానికి తెలియజేస్తా! దయచేసి ఈ ధర్నాను ఆపి మీ వూళ్ళకు వెళ్ళండి అంటూ అందరికి నమస్కరిస్తూ తన కార్యాలయంలోకి వెళ్లారు.

తన ఛాంబరులో కూర్చొని పృధ్వీ గురించి ఆలోచిస్తున్నారు కలెక్టర్ ధర్మతేజ. అంతకుమునుపే  పృధ్వీ గురించి అతనికి తెలుసు. అందుకే అతని దగ్గరకే వెళ్ళి మాట్లాడడానికి వెనుకాడలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు. ఎంత చక్కగా మాట్లాడాడు. శ్రీశ్రీ గారు అన్నట్టు ఇలాంటి యువకులే ముందు యుగపుదూతలు. వీరే పావన, నవజీవన బృందావన నిర్మాతలు అనుకున్నారు ధర్మతేజ

ఇంటికి వచ్చాడే కాని అతని చెవులలో పృధ్వీ మాటలే ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ వయసులో తను కూడా సమాజానికి ఏదో చేయాలని ఈ ఉద్యోగంలో చేరానన్నది గుర్తుకువచ్చిందతనికి. ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి రిపోర్ట్ పంపించాలని ఆలోచిస్తున్నాడు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ఏర్పాటు చేయడంలోని అసలు లక్ష్యం నెరవేరలేదన్నది నిర్విదాంశంప్రభుత్వం నుంచి వేలాది ఎకరాలు పొందిన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు రియల్‌ ఎస్టేట్‌ కేంద్రాలుగా మారుతున్నాయి అన్నదాంట్లో కొంతైనా నిజం లేకపోలేదు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో వీటి యజమానులు విఫలం అయ్యారన్న విషయం కూడా అక్కడక్కడా వినపడుతోంది.

 పోస్కో అన్న దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి సంస్థ కోసం సేకరించాలనుకొన్న వ్యవసాయ భూమిని అక్కడి రైతుల ప్రతిఘటనకు రద్దు చేసుకున్న ఒరిస్సా ప్రభుత్వ నిర్ణయం సమయానికి గుర్తుకువచ్చింది అతనికి. ఇప్పుడు తను పంపించే నివేదిక మీదే పృధ్వీ గ్రామ ప్రజల భవిష్యత్తు ఆధారపడివుంది అనుకున్నాడు

ఏఏ అంశాలు తన నివేదికలో పొందుపరచాలని ఆలోచిస్తున్న అతనికి తన పుస్తకాల అరలోని ఒక పుస్తకం అతని కంటిని ఆకర్షించింది. అప్రయత్నంగా అతని కాళ్ళు దాని దగ్గరకు తీసుకెళ్ళాయి. అతని చేతులు ఆ పుస్తకాని బయటకు తీసి పేజీలను తెప్పసాగాయి. ఒక పేజీ దగ్గర అతని దృష్టి ఆగింది. అతని కళ్ళు ఆ పదాలను చదవసాగాయి. ఆ పుస్తకం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం. ఆ ఖండిక జయభేరీ.

ఆ పదాలు........

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!

ఎన్నోసార్లు చదివిన వాక్యాలు ఇప్పడు మళ్ళీ చదువుతుంటే నూతన ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని ఇచ్చాయతనికి.

నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను!
నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను!

చదివిన తరువాత తన కర్తవ్యం బోధపడింది కలెక్టర్ ధర్మతేజకు. వెంటనే తన లాప్ టాప్ తెరచి దానిపై రెండుగంటలపాటు ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికను టైపు చేశారు. తాను తయారుచేసిన నివేదికను తిరిగి ఓసారి చదివాక సంతృప్తి కలిగింది అతనికి. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోయారు ధర్మతేజ.

సరిగ్గా నెలరోజుల తరువాత ప్రభుత్వం నుండి వెలువడిన నిర్ణయం పృధ్వీని అతని గ్రామప్రజలను సంబరాలలో ముంచెత్తింది.

 ----------------------సమాప్తం-----------------------------------

Wednesday 8 February 2012

ఎంతో మధురమీ స్నేహం - 26

స్కార్పియో NH7 పై దూసుకెళుతోంది. అభిషేక్ ఏకాగ్రతతో నడుపుతున్నాడు. పక్కనే కూర్చున్న చైతన్య అతన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని పాటపాడుతున్నాడు చైతన్య.
ఇంతలో అతని సెల్ఫోన్ రింగయ్యింది. అన్సర్ బటన్ నొక్కి చెప్పు హారిక! అన్నాడు చైతన్య.
ఎక్కడికెళ్ళావ్? నిన్నటినుంచి కనిపించలేదు! అడిగింది అటువైపున హారిక
నిన్న వైజాగ్ నుండి అభి వచ్చాడు. అప్పటినుంచి జీవితం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఏ మలుపు దగ్గర ఎవరు ఎదురవుతారో తెలియట్లేదు
ఇప్పుడెక్కడ వున్నారు?
తాడిపత్రికి వెళుతున్నాము. అదెక్కడ వుంది? ఎందుకెళుతున్నారు అనే ప్రశ్నలు వెయ్యకు. నా పరిస్థితే ఈమధ్యనే చూసిన లవకుశ సినిమాలో లక్ష్మణుడు అడివికి తీసుకెళుతున్నపుడు సీతమ్మకు ఎదురైనా పరిస్థితిలాగుంది. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు వుండే ప్రాంతానికి వెళుతున్నాము. అన్నీ సవ్యంగా జరిగి క్షేమంగా తిరిగి వచ్చాక మిగతా  విషయాలు మాట్లాడుకుందాం! సరేనా!
సరేమరి! వచ్చాక ఫోన్ చెయ్యిఅన్నది హారిక
ఓకే, అలాగే! అంటూ ఫోన్ కట్టేశాడు చైతన్య.
ఎందుకురా నువ్వు అనవసరంగా భయపడుతూ తనని కూడా భయపెడతావ్?అన్నాడు అభిషేక్
రేయ్! నువ్వు తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూస్తావ్! అందుకే భయపడడం లేదు. ఫ్యాక్షన్ సినిమాలు చూసుంటే తెలిసేది నేనెందుకు భయపడుతున్నానో. నా కళ్ళ ముందు ఇప్పుడు సమరసింహా రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆదికేశవరెడ్డి కదలాడుతున్నారు
ముంబయిలో మాఫియా వుందని అక్కడున్న అందరూ గ్యాంగ్స్టర్స్ అవుతారా! ముంబాయికి ఎవరూ వెళ్ళట్లేదా! ఇది కూడా అంతే! అన్నాడు అభిషేక్.
అబ్బా ఏమి కంపారిసన్ రా! అంటుండగా స్కార్పియో కృష్ణా నది బ్రిడ్జ్ దాటింది. పక్కనున్న బోర్డును చూసి ఇది బీచుపల్లి అటారా! కర్నూల్ 50 కీ.మీ వుందట! చెప్పాడు చైతన్య.
సరే! కర్నూల్లో ఆగి టిఫిన్ చేద్దాం! అన్నాడు అభిషేక్.
అరగంట తరువాత కర్నూల్ చేరారు. అక్కడి రాజ్ విహార్ హోటల్లో టిఫిన్ చేసి గంట తరువాత తిరిగి బయలుదేరారు.
ఇది రాయలసీమగడ్డ! గాండ్రించు పులిబిడ్డా! అంటూ మొదలుపెట్టి ఇదివరకు తను విన్న సీమ పాటలు పాడసాగాడు చైతన్య.
గంటన్నర తరువాత వారు గుత్తి చేరారు. కొండ మీది కోట చూసి రేయ్! అభి! ఆ కోటను శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడంటావా! సందేహం వ్యక్తం చేస్తూ అడిగాడు చైతన్య.
చైతన్యను చూస్తూ, శ్రీకృష్ణదేవరాయలా! ఆయనెవరు? అడిగాడు అభిషేక్.
తనవైపు వింతగా చూసి, నీకిప్పుడు చరిత్ర చెప్పలేనుగానీ ముందు చూసి పోనివ్వు! అన్నాడు చైతన్య.
కొద్ది దూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో వారికి ఎటువెళ్ళాలో అర్థం కాలేదు.
అభి! కాస్త సైడుకి ఆపు! ఎవరినైనా అడుగుదాము! అన్నాడు చైతన్య
టీ బంకు పక్కనున్న అరుగుమీద ముగ్గురు వ్యక్తులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి పక్కన ఆపగానే, గ్లాసు దించి, మధ్యలో కూర్చున్న బుగురు మీసాలతన్ని చూస్తూ, అన్నా! తాడిపత్రికి ఎలా వెళ్ళాలి! అడిగాడు చైతన్య.
యాడికి పోయి పోవాలా!అన్నాడతను.
నేనడిగిందే మళ్ళీ చెబుతున్నాడు అనుకొని అదే అన్నా నేను అడుగుతున్నా! తాడిపత్రికి పోవాలంటే ఎలా వెళ్ళాలి
అదే కదా నేనూ చెబుతాన్నా పిల్లోడా! యాడికి పోయి పోవాలా! చెప్పాడు మీసాలతను.
అయ్యో చెప్పిందే చెబుతున్నాడు. తింగరోడిలా వున్నాడు ఎలా అనుకొంటూ డోర్ తెరచి కిందకు డిగాడు చైతన్య.
అన్నా అదికాదు! ఇప్పుడు తాడిపత్రి వుంది కదా! ఆ వూరికి ఎలా వెళ్ళాలి
ఏంది పిల్లోడా! అర్థం కావట్లేదా! యాడికి పోయి పోవాలా! మళ్ళీ అదే చెప్పాడు.
అయ్యో అనుకుంటూ తల పట్టుకున్నాడు చైతన్య. పక్కనున్న వాళ్ళను చూసి, మీరైనా చెప్పండన్నా! అన్నాడు చైతన్య
ఏయ్! ఏంటి తమాషాలు చేస్తున్నావా! పెద్దాయన చెప్తున్నాడు కదా! యాడికి పోయి పోవల్ల!కాస్త కటువుగా చెప్పాడు పక్కనున్నవాడు.
ఏడుపు ఒక్కటే తక్కువైంది చైతన్యకు. మళ్ళీ అడిగితే కొట్టేట్టు వున్నారు. ఇప్పుడెలా అనుకున్నాడు. 

అంతలో అంతవరకూ టీ తాగుతూ వింటున్న ఒకతను కలగజేసుకొని, తాడిపత్రి వెళ్ళాలంటే 'యాడికి' అనే వూరి మీదుగా పోవాలి అని అంటున్నాడతను. తాడిపత్రికి పోవల్ల అంతే కదా! నేను చెప్తా! ఇక్కడినుండి నేరుగా పొండి. Y జంక్షన్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకోండి. ఆడ నుండి ఇరవయైదు కిలోమీటర్లు వెళ్ళాక యాడికి  వస్తుంది. దాని దాటి ఇంకో ఇరవయైదు కిలోమీటర్లు వెళితే తాడిపత్రి వస్తుంది చెప్పాడు
బతికించావు అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి స్కార్పియోలో కూర్చొని ఎవరైనా అడ్రస్ అడిగితే అలా చెప్పాలి. మీరూ వున్నారు తిక్కతిక్కగా చెప్పి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు అన్నాడు చైతన్య
ఏంట్రా వాడు గొణుగుతున్నాడు. ఏసైండిరా వాణ్ణి! అన్నాడు మీసాలు మెలేస్తూ .
ఓర్ని అనవసరంగా వాగానే అనుకుంటూ రేయ్ అభి! పోనివ్వరా!  వచ్చేస్తున్నారు అన్నాడు చైతన్య తొందరపెడుతూ.
గేరు మార్చి బండిని ముందుకురికించాడు అభిషేక్.
ఇందాక టీ బంకు దగ్గరతను చెప్పినట్లే Y జంక్షన్ దగ్గర ఎడమవైపుకి తిప్పాడు అభిషేక్.  అరగంట తరువాత యాడికి చేరారు వారు. టైం చూస్తే ఒంటిగంట కావస్తోంది. ఆకలేస్తోంది, ఇప్పుడెలా అనుకొంటుండగా భోజనశాల అని వ్రాసున్న బోర్డు కనపడింది చైతన్యకి. అతని కోరికమేరకు దాని పక్కన ఆపాడు అభిషేక్. ముఖం కడుక్కొని లోపల కూర్చున్నారు ఇద్దరూ.
ఒకతను వచ్చి ఏమి కావాలని అడిగాడు
మీ హొటల్ స్పెషల్ ఏంటి? అడిగాడు చైతన్య
రాగి సంగటి, నాటుకోడి పులుసు చెప్పాడతను
ఇదేంటి రాగి సంగటి! ఎప్పుడూ వినలేదే అని మనసులో అనుకుంటూ ఇంకా ఏమున్నాయి? అడిగాడు చైతన్య
జొన్నరొట్టె, తలకాయ కూర!
వినగానే అదిరిపడ్డాడు చైతన్య. ఎవరి తలకాయ? అడిగాడు భయంగా.
హహ్హహ్హ అని నవ్వుతూ, గొర్రెది అబ్బీ! అన్నాడతను.
ఓహ్ బతికించావు అంటూ అన్నీ మాంసాహారాలేనా, శాఖాహారం లేదా!
స్పెసల్ అని అడిగితివికదాని అవి చెప్పినా! అన్నమూ, పప్పు, చారు వున్నాయి. పెట్టమంటావా అబ్బీ!
సరే! తీసుకురా!  అన్నాడు చైతన్య.
విస్తరి వేసి వడ్డించాడతను. ఏమో అనుకున్నాముగానీ రుచికరంగానేవున్నాయి వంటలు అనుకున్నారు స్నేహితులిద్దరూ. కాసేపు ప్రయాణబడలిక తీర్చుకొని మళ్ళీ బయలుదేరారు వారు. 

వూరు దాటుతుండగా బడిపిల్లలు లిఫ్ట్ కావాలంటూ బొటనవేలు చూపిస్తున్నారు. వెనకంతా ఖాళీనే కదా తీసుకెళదాం అన్నాడు చైతన్య. సరేనని బండి ఆపాడు అభిషేక్.
ఉత్సాహంగా పది మంది పిల్లలు వెనకున్న రెండు వరసల సీట్లు

ఆక్రమించేశారు. మళ్ళీ కదిలింది స్కార్పియో. వాళ్ళను చూస్తుంటే  చైతన్యకు 

తన చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.

ఏంట్రా, బడి అప్పుడే అయిపోయిందా! అడిగాడు చైతన్య
అయిపోలేదు. అన్నంతిని మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టాము! అన్నారందరూ నవ్వుతూ.
మరి రేపు వెళితే మాష్టారు అడగరా! మళ్ళీ మీకు భోజనం పెడతారా!
ఎందుకుపెట్టడు. వాడబ్బ సొమ్మా! పెట్టకపోతే సంపేత్తాము అన్నాడొకడు.
అమ్మో! సీమ పౌరుషం కనపడుతోంది అనుకున్నాడు చైతన్య.
ఇంతలో కటకటమని నములుతున్నట్టు వినపడింది. వెనక్కి తిరిగి చూసి ఏంట్రా తింటున్నావు? అడిగాడు చైతన్య.
కమ్మరకట్టు! అన్నాడు పల్లికలిస్తూ.
ఏమి కట్టు!తిరిగి అడిగాడు చైతన్య.
కమ్మరకట్టన్నా! బాగుంటుంది. తింటావా! అన్నాడు చేయిచాచి.
వద్దులే అంటూ పక్కనున్న వాడి చేతిలో బంతి ఆకారంలో వున్నదాన్ని చూసి ఏంటిరా అది!
బొరుగులుండ! కావల్నా! అన్నాడు వాడు.
ఏమి వుండరా బాబూ! బాంబులాగుంది. నువ్వు తిను! అన్నాడు చైతన్య.

ఇది బాంబట రోయ్! అని అరిచాడు వాడు. మిగతా వారు గొల్లున నవ్వారు. 
 "ఏ వూరురా మీది? అడిగాడు చైతన్య
వీరా రెడ్డి పల్లి చెప్పాడొకడు
వూరి పేరులో కూడా సీమ మార్క్ వుందని చైతన్య అనుకొంటుండగా, అన్నా, ఇక్కడాపు! అరిచారందరూ.
అభిషేక్ ఆపాడు. బిలబిలమంటూ దిగారందరూ. ప్రతిఒక్కరూ వచ్చి థ్యాంక్స్ అన్నా! అంటూ ఇద్దరికి షేఖ్హాండ్ ఇచ్చారు.
వారికి బై చెప్పి ముందుకు కదిలారు అభిషేక్ చైతన్యలు. మరో అరగంట ప్రయాణం తరువాత తాడిపత్రి చేరారు వారు. 

చేరగానే ముందురోజు జోసెఫ్ రెడ్డి దగ్గర తీసుకున్న నెంబరుకు ఫోన్ చేశాడు అభిషేక్. అటువైపు ఫోన్ రింగవుతోంది. అభిషేక్ గుండె వేగం పెరుగుతోంది. ఇంతలో ఫోన్ లిఫ్ట్ చేసినట్టు తెలిసింది అతనికి. హల్లో! అన్నాడు మెల్లగా.
హల్లో! ఎవరు కావాలి? అన్నారు అటువైపున.
ఇదేంటి దివ్య మాట్లాడుతుంది అనుకుంటే ఎవరో ముసలి గొంతు వినపడుతోంది. అంటే ల్యాండ్ నెంబర్ ఇచ్చాడన్నమాట అని మనసులోనే తలచి, దివ్య వుందా! అడిగాడు అభిషేక్.
ఇంట్లో లేదు! ఇప్పుడే గుడికి వెళ్ళింది. ఇంతకూ మీరెవరు?అడిగాడు అటువైపాయాన.
నా పేరు అభిషేక్. దివ్య ఫ్రెండుని. ఏ గుడికి వెళ్ళింది తను!
ఏటిగట్టు నుండే బుగ్గరామలింగేశ్వరాలయానికి వెళ్ళింది చెప్పాడాయన
థాంక్స్ అని పెట్టేశాడు అభిషేక్. పక్కనే వున్న ఆటో వాడిని అడిగాడు ఆ గుడికి దారెటని. అతను చెప్పాక స్కార్పియోను ఆ దారి వైపు పోనిచ్చాడు.
ఇప్పుడు వచ్చిన దారినే మళ్ళీ వెళుతున్నాము కదరా! అడిగాడు చైతన్య.
అవును! మనమోచ్చింది గట్టు పక్కనుండే కదా! చెప్పాడు అభిషేక్.


బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ ముఖద్వారం (లోపలి వైపు)
మరలా ఒకరిద్దరి దగ్గర వాకబు చేసి దేవాలయానికి చేరుకున్నారు వారు. పాదరక్షలు బయట వదిలి లోనికి ప్రవేశించారు. 

దివ్య కోసం చుట్టూ కలయతిరిగారు. అభిషేక్ మరింత ఆత్రుతగా వెతకసాగాడు ఆమె కోసం. 
ఈలోగా వారికి ఏటిలోకి దారితీసే మెట్లు కనపడ్డాయి. అటువైపుగా వెళ్లారు.

 క్రింది వైపున చివరి మెట్టు మీద ఒక అమ్మాయి కూర్చోని వుండటాన్ని గమనించారు ఇద్దరూ. వెనుక నుండి ఆమెను చూడగానే తను దివ్య అని గుర్తుపట్టాడు అభిషేక్.
మెల్లగా ఒకొక్క మెట్టుదిగుతున్నాడు అభిషేక్. అతడిని అనుసరించాడు చైతన్య.
తనని సమీపించగానే, హాయ్ దివ్! అన్నాడు అభిషేక్.

విన్న ఆ అమ్మాయి గిర్రున తలతిప్పి చూసింది.
అభిషేక్ ని చూడగానే, ఎక్స్పెక్ట్ చేశాను నువ్వువస్తావని. కానీ ఇంత తొందరగా వస్తావనుకోలేదు అన్నది
ఎలా వున్నావు దివ్! అడిగాడు అభిషేక్
ఇప్పటివరకు బాగానే వున్నాను. కానీ నన్నలా పిలువకు....అలా పిలిచే అర్హత పోగొట్టుకున్నావ్! యు లాస్ట్ దట్ రైట్!
ఐ యాం సారీ దివ్!

ఇట్స్ టూ లేట్ అభి!

ఆలయం ప్రక్కన్న పెన్నానది తీరం
అక్కడ నిశబ్దం అలుముకుంది. ఏటిలో ఈత కొడుతూ అరుస్తున్న వారి అరుపులు, బట్టలుతుకుతున్న వారు చేసే శబ్దాలు వినపడుతున్నాయి.

మళ్ళీ ఏటి వైపుకి తలతిప్పి చూడసాగింది దివ్య.
కొద్దిక్షణాలు అలాగే గడిచాయి. చైతన్యకు అయోమయంగాను, ఇబ్బందిగాను వుంది.  ఏదో ఒకటి మాట్లాడాలని ఈ నది పేరేంటండిఅడిగాడు.
తల వెనుకకి తిప్పి అభిషేక్ ని చూస్తూ, “హు ఈజ్ దిస్ గై? అడిగింది దివ్య
అభిషేక్, చైతన్య చేతిని పట్టుకొని దివ్య ముందుకు వచ్చి, చైతన్య! నా బెస్ట్ ఫ్రెండ్!అని దివ్యకి చూపిస్తూ చెప్పి, చైతూ! ఈమె దివ్య, దివ్యారెడ్డి! నిన్న మనం వీళ్ళ ఇంటికే వెళ్ళింది! అన్నాడు
హాయ్! అన్నాడు చైతన్య
చైతన్యని ఎగాదిగా చూస్తూ హాయ్! అంది దివ్య. మళ్ళీ తనే ఇది పెన్నా నది! ఇలా నీరెండలో ఏటి పక్కన కూర్చోని, గుడిగంటల శబ్దం వింటూ టైం స్పెండ్ చేయడం నాకిష్టం!” చెప్పింది.
అవునూ, మీ నాన్నగారి పేరేమో జోసెఫ్ రెడ్డి...మీ ఇంట్లో హోలీ క్రాస్ ఫ్రేమ్ కూడా చూశాను. అంటే మీరు కన్వర్టర్డ్ క్రిస్టియన్స్ కదా! మరి ఇలా గుడి పక్కన కూర్చున్నారు సందేహం వెలబుచ్చాడు చైతన్య.
చైతన్యను కోపంగా చూసి అభిషేక్ వైపు తిరిగి నువ్వే పెద్ద తేడా అనుకుంటే నీ కంటే పెద్ద తేడాగాడులా వున్నాడు అంటూ లేచి వెనక్కు తిరిగి మెట్లు ఎక్కసాగింది దివ్య.
ఏంటిరా ఈమె ఇలా మాట్లాడుతోంది అని సైగలు చేస్తూ అడిగాడు చైతన్య.
కాసేపు గమ్మునుండు నేను మాట్లాడుతాగా అని తను కూడా సైగలు చేస్తూ చెప్పాడు అభిషేక్.
దివ్య పైమెట్టు దగ్గర ఆగి వెనక్కు తిరిగి ఏంటి అక్కడే సెటిలవుతారా! ఓకే, బై! అని గుడిలోకి వెళ్ళింది.
లేదులేదని అని ఒక్క ఉదుటున వాళ్ళు కూడా గుడిలోకి వచ్చి ఆమెను అనుసరించారు.
ఎప్పుడు తిరుగు ప్రయాణం. తొందరగా బయలుదేరితే మంచిది...అర్ధరాత్రికి హైదరాబాద్ చేరవచ్చు! అన్నది దివ్య
ఏమీ మాట్లాడకుండా నడవసాగారు అభిషేక్ చైతన్యలు.
ఆమె ఆగి, “ఎలాగూ వచ్చారు కదా మా గుడిని చూసి వెళ్ళండి! అన్నది.
మా గుడి అంట....మీ తాతేమైనా కట్టించాడా అని మనసులో అనుకున్నాడు చైతన్య.
ఏంటి ఆ ఫేసు! మా గుడి అంటుంది....మీ తాతేమైనా కట్టించాడా అని అనుకుంటున్నావా! మా గుడి అంటే మా వూరి గుడి అని అర్థం! అంటూ అర్థమయ్యిందా అన్నట్టు చూసింది చైతన్యని దివ్య.
అయ్యబాబోయ్! ఆవులిస్తే పేగులు లెక్కెట్టేట్టు వుంది అనుకున్నాడు చైతన్య.
మరేమనుకున్నావ్ జాగ్రత్త అన్నట్టు చూసి, రండి మా వూరి గుడి చూపిస్తాను! అంటూ ముందుకు కదిలింది దివ్య.
ఆమె పక్కనే నడిచారు ఇద్దరూ.
చూడండి! ఈ స్థంభాలపై నాట్య భంగిమలు. ఎంత అద్భుతంగా చెక్కారో. వీటిని సాలభంజికలు అంటారు!”  అని చూపించింది.
సూపర్! శిల్పి ఏ బిపాసాబసునో, ఏ తమన్నానో తలుచుకుంటూ చెక్కుంటాడుఅన్నాడు చైతన్య.
కోపంగా చూసి నిజంగా వీడు తేడా! అంది దివ్య
కాసేపు గమ్మనుండరా! అన్నాడు అభిషేక్ చైతన్యను చూస్తూ.
మళ్ళీ దివ్యని చూసి నువ్వు చెప్పు దివ్! అన్నాడతను.
ఇది చూడండి! చెట్టు కొమ్మపై రామచిలుకలు, ఇంకొక పక్క కోతులు, కింద నెమళ్ళు! ఎంత బాగా చెక్కారో చూడండి!
నిజమే ఎంత బాగా చెక్కారు శిల్పులు అనుకున్నారు స్నేహితులిద్దరూ.
ఈ గుడిని ఎవరు కట్టించారండి! అడిగాడు చైతన్య.
విజయనగర రాజుల కాలంలో తాడిపత్రి ప్రాంత మండలలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయుడు కట్టించాడు చెప్పింది దివ్య
ఇక్కడికి రండి! అంటూ ఒక స్తంభం దగ్గర నిలబడి వీటిపై చిన్నగా మీటితే సరిగమలు పలుకుతాయి తెలుసా! అని తన చేతిలోని కీసుతో  మూల స్థంభం చుట్టూ వున్న చిన్న స్తంభాలపై చిన్నగా మోదుతూ వుంటే సరిగమలు పలుకుతున్నట్టే వినిపించింది వారికి.

ఆశ్చర్యపోయారు ఇద్దరూ. ఇలాంటి అద్భుతం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు వారు.
ఇలాంటి స్తంభాలే హంపీలో కూడా వున్నాయి! అన్నది దివ్య.
ఇక్కడ చూడండి! ఈ గుడి బరువంతా తన చేతులు, భుజస్కందాలపై మోస్తున్నట్టు వుందీ శిల్పంచూపించింది దివ్య.
వావ్! అభి చూడరా! ఆ సిక్స్ ప్యాక్ బాడీ....ఏ జిమ్ వెళ్ళాడో! అన్నాడు చైతన్య
అయ్యో! చూస్తున్నానులేరా! నువ్వు గమ్మనుండు! అని సైగలతో చెప్పాడు అభిషేక్.
అలా గుడి అంతా కలయతిప్పుతూ చూపించింది దివ్య.

ఈలోపు సాయంసంధ్య అవుతుండడం గమనించి రండి సన్సెట్ చూద్దాం! అంటూ మళ్ళీ ఏటిగట్టు వైపుకి తీసుకెళ్ళింది వారిని.
కాసేపు సూర్యాస్తమాన్ని చూస్తుండి పోయారు ముగ్గురూ.
తన మూడ్ బాగున్నట్టుందని దివ్యా! నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి! అడిగాడు అభిషేక్.
తనవైపొకసారి చూసి మళ్ళీ సూర్యుడివైపు తిరిగి ఏముంది మమ్మీ,డాడీ పెళ్ళిచేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నేనుకూడా ఓకే చెబుదామని అనుకుంటున్నాను అన్నది దివ్య
మరి నీవు అంత కష్టపడి ఫిలిం మేకింగులో బ్యాచిలర్స్ చేశావు కదా! నీ టాలెంటిని ప్రూవ్ చేసుకోవాలని లేదా!అడిగాడు అభిషేక్
అంత శ్రమ ఎందుకు అనిపిస్తుంది. స్క్రిప్ట్ రాయడం... ప్రొడక్షన్స్ ఆఫీసుల చుట్టూ తిరగడం... ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం... ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది! హాయిగా పెళ్ళిచేసుకొని సెటిలయిపోక!చెప్పింది దివ్య.
సరే! కథ రెడీగా వుంది, డైరెక్షన్ చెయ్యమంటే చేస్తావా!
కథ వుంటే సరిపోతుందా! మరి ప్రొడ్యుసర్!
మనమే! అంటే నేనే ప్రొడ్యూస్ చేద్దామని!సణిగాడు అభిషేక్.
నో వే! నువ్వు ప్రొడ్యుసర్ అయితే నేను కోటి రూపాయిలిచ్చినా చెయ్యను!
ప్లీజ్ దివ్! అలా ఫ్రీజ్ అవ్వకు! ఒక్కసారి ఆలోచించు!
నో! ఐ కాంట్!
ప్లీజ్ దివ్! నా మీద కోపంతో అలా హార్ష్ డెసిషన్ తీసుకోకు!
తన స్నేహితుడి పరిస్థితి చూసి రేయ్! ఎందుకురా అంతగా బతిమాలుతావు లోకంలో ఇంకెవ్వరూ లేనట్టు!  హైదరాబాదులో కృష్ణానగర్లో కూత వేస్తే వెయ్యి మంది లైన్లో నిలుచుంటారు డైరెక్షన్ చేస్తామని. అదీ ఒక్క పైసా ఆశించకుండా! ఇందుకేనా ఈ తొక్కలో తాడిపత్రికి వచ్చిందిఅన్నాడు కోపంగా చైతన్య.
ఏయ్! ఏంటి తొక్కలో తాడిపత్రి అంటున్నావు. మా వురిని ఏమైనా అంటే నిన్ను ఏట్లోకి తోసేస్తా! మూడు తరాలు దాటినా ఇంకా తెలుగు సినిమాలకు తలమానికంగా వున్నది... ప్రపంచంలోని చాలా ఫిలిం స్కూళ్ళల్లో పాఠ్యాంశంగా వున్న తెలుగు సినిమా స్క్రిప్ట్ ఏంటో తెలుసా!” అడిగింది దివ్య.

మాయా బజార్ సెట్స్ పై దర్శకులు కె.వి.రెడ్డి
ఆ...ఎందుకు తెలీదు. మాయా బజార్చెప్పాడు చైతన్య.
ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా! ఆయనది ఏ వూరో తెలుసా!
కె.వి.రెడ్డి. ఆయనది ఈ వూరేనా? అయితే ఏంటట! అన్నాడు చైతన్య.

"అవును మరి తెలిసి కూడా ఎందుకు మమ్మల్ని, మావూరిని తక్కువ చేసి మాట్లాడతావ్!" అడిగింది

"అదేదో సామెత...ఆ....మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టుంది. ఆయన పేరుముందున్న కె, చివరన రెడ్డి పెట్టుకొని కె.డి.రెడ్డి గా నిన్ను నీవు పెద్దగా వూహించేసుకుంటున్నావు! అంత తోపా నువ్వు! అలాంటి గుర్తుండిపోయే సినిమా నువ్వు తీయగాలవా!” రెచ్చగొట్టాడు చైతన్య.

అభీ వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నువ్వు కంట్రోల్ చేస్తావా? నన్ను చేయమంటావా? అన్నది ఆవేశంగా దివ్య.
నువ్వు ఆవేశపడకు నేను చూసుకుంటా కదా!  అని చైతన్య వైపు తిరిగి రేయ్! ఇంకోసారి నోరు విప్పావంటే చంపేస్తాను! అని తన నోరు గట్టిగా మూసాడు అభిషేక్.
మళ్ళీ దివ్య వైపు తిరిగి వాడి మాటలేవీ పట్టించుకోకు! నువ్వు ఒకసారి ఈ కథ చదువు! ఆ తరువాత నీ ఇష్టం!అని తన చేతిలోని కథాపుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు.
వై షుడ్ ఐ! నాకవసరం లేదు! అన్నది అభిషేక్ చేతిని తోస్తూ.
ప్లీజ్ దివ్! ఒక్కసారి చదివి డెసిషన్ తీస్కో! అని మళ్ళీ పుస్తకాన్ని తన చేతిలో పెట్టాడు అభిషేక్.
మళ్ళీ తోసేయడానికి ప్రయత్నిచింది దివ్య. పడిపోతున్న పుస్తకాన్ని అందుకుంటుండగా ఏటిగాలికి పేజీలు కదిలాయి. పేజీల కదలికలో ఆ కథ టైటిల్ కనపడింది దివ్యకు. పుస్తకాన్ని ఒడుపుగా పట్టుకొని మొదటి పేజీని తిప్పగానే దానిపై వ్రాసున్న కథ పేరు చూసింది. ఎంతో మధురమీ జీవితం! if someone shares love & life. శీర్షికతో పాటు ఉపశీర్షికను చదవగానే ఏదో పులకింతకు లోనయింది. ఎంత మంచి టైటిల్. టైటిలే ఇంత బాగుంటే కథ ఎంత బాగుంటుందో అనిపించింది ఆమెకు. క్షణకాలం అలోచించిన తరువాత సరే చదువుతాను! నువ్వు చెప్పావని కాదు, ఈ టైటిల్ కోసం! అన్నది దివ్య అభిషేక్ ని చూస్తూ.
“హమ్మ, చదువుతానన్నావు! అది చాలు! అన్నాడు అభిషేక్. ఒక్కసారి చదివితే ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నమ్మకంతో. అతని నమ్మకం ఆ కథ మీద కాదు. అసలుకి కథే చదవలేదు అతడు. ఆ నమ్మకం తన స్నేహితుడు శ్రీరామ్ మీద మరియు కథ గురించి చెప్పిన మహాలక్ష్మి మాట మీద.
వెళ్దామా! అన్న దివ్య మాటతో ఆలోచనల నుండి బయటపడి సరే అన్నాడు అభిషేక్.
ముగ్గురూ అక్కడి నుండి కదిలారు.

ఇంకా వుంది.......